ప్రపంచంలో ఏం జరుగుతోంది? రోజువారీ పరిణామాలను చూస్తే సామాన్యులకు అనేక విషయాలు అంతుపట్టటం లేదంటే అతిశయోక్తి కాదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన ఏకపక్ష దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేని మరణించారు. తరువాత దాడులు కొనసాగిన కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసి జూలై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య పూర్తిచేశారు. ఈ క్రతువులో వందకుపైగా దేశాల నేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గాలు పాల్గొన్నట్టు వార్తలు. ఖమేని అంత్యక్రియల్లో పాల్గొనే దేశాలపై ప్రతీకా రం తీర్చుకుంటామని అమెరికా బెదిరించటంతో 13దేశాలు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. మనదేశం తరఫున విదేశాంగశాఖ ఉపమంత్రి పవిత్ర మార్గరిటా నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం హాజరైంది. ఖమైనీ మరణానికి అధికారికంగా సంతాపం తెలిపితే ఎక్కడ అమెరికాకు కోపం వస్తుందోనని తటపటాయించిన మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల తరువాత సంతాప ప్రకటన, ఇప్పుడు అంత్యక్రియల్లో పాల్గొన్నది. ఇరాన్ నేతలు, మిలిటరీ అధికారులు అందరూ ఒకేచోట దొరికినా తాము వారిని మట్టుబెట్టేందుకు పూనుకోలేదంటూ డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడుతో మరోసారి అమెరికా పరువు తీశాడు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాట్లాడిన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ‘‘దేశానికి అతిపెద్ద ముప్పు కమ్యూనిజం’’ అని చెప్పాడు.
ఇలాంటి వారందరినీ చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. అది వేరే విషయం. ఇండో-పసిఫిక్ ప్రాంతం నిబంధనల ప్రాతిపదికన స్వేచ్ఛగా ఉండాలంటూ జపాన్ ప్రధాని సానే తకాచీతో కలసి భారత్ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. తన మిలిటరీ వ్యూహంలో భాగంగా మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలనుకున్నది అమెరికా.1947లో ప్రారంభించిన అమెరికా పసిఫిక్ కమండ్ పేరును 2018లో ట్రంప్ నాయకత్వంలో యంత్రాంగం అమెరికన్ ఇండో-పసిఫిక్ కమాండ్గా మార్చింది. ఇపుడు అదే ట్రంప్ జూన్ నెలలో మనదేశం పేరును తొలగించి పాతపేరును పునరుద్దరించాడు. మన చిత్రపటాన్ని మార్చి ఆక్రమిత్ కాశ్మీరును పాక్ ప్రాం తంగా దానిలో ముద్రించాడు. ఏ రెండు దేశాలైనా జతకట్టవచ్చని అది మూడో దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని మోడీ-తకాచీ భేటీ గురించి చైనా ప్రకటించింది. ఆ తరువాత తమకు వ్యతిరేకంగా ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే సంగతి తేలుస్తామనే హెచ్చరికగా ఐదురోజుల కిందట చైనా జలాంతర్గాముల నుంచి ప్రయోగించే అణుక్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.మార్చి నెల ఒకటవ తేదీ నుంచి మీడియాలో పశ్చిమాసియా సంక్షోభానికి పెద్ద పీటవేసి ఉక్రెయిన్ పరిణామాలను దాదాపుగా విస్మరించారు. తిరిగి ఈ వారంలో ఆ వార్తలు చోటు చేసుకున్నాయి.
గత విశ్లేషణల్లో చెప్పినట్లుగా ఇరాన్పై అమెరికా దాడి ప్రపంచంలో నూతన పరిణామాలకు నాంది పలికింది.అనేక దేశాలు ఇప్పుడు విశ్వసనీయమైన దేశమేదంటే అమెరికా బదులు చైనాను ఎంచుకుంటున్నాయి. కమ్యూనిస్టు, బీజింగ్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడని వ్యవహారం గనుక ఈ పరిణామాన్ని గుర్తించనట్లే వ్యవహరిస్తారు. అమెరికా రక్షణపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవలి పరిణామాల తరువాత దానితో సంబంధాల గురించి వెంటనే బహిరంగంగా వెల్లడించకపోయిన ప్పటికీ పునరాలోచనలో పడ్డాయి. ఇదే విధంగా అమెరికా కనుసన్నలలో నడిచే నాటో కూటమిలోని ఐరోపా దేశాల పరిస్థితీ అదే. తమ రక్షణకు తామే ఆయుధాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటు న్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది గతంలోనే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మరింతగా మధనం జరగనుంది. పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే పదాన్ని చేర్చటం-తొలగించటం ఒక సాధారణ వ్యవహారం కాదు. పేరు మార్పు చారిత్రాత్మక గుర్తిం పును పునరుద్దరించటం తప్ప వేరు కాదని అమెరికా బుకాయిస్తున్నది.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. అసలు విషయం ఏమంటే చైనాకు వ్యతిరేకంగా మనదేశాన్ని నిలిపేందుకు 2018లో అమెరికా వేసిన బిస్కెట్ ఇండో అనే పదాన్ని చేర్చటం. గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన అమెరికా కుంటిసాకుతో ఆ పేరును తొలగించింది.
ఒక విధంగా ఇది మనలను బెదిరించటమే. మనదేశ పాలకవర్గానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీతగీత దాటితే ఏమైందో తెలుసుగనుక చైనా వ్యవహారంలో కూడా అదే మాదిరి ప్రస్తుతం పరిధి దాటేందుకు సిద్దం కాదు. తరువాత ఎలా మారేదీ ఊహాజనితమే. అమెరికన్ ఏజన్సీల తప్పుడు సమాచారం, ప్రోత్సాహంతో గాల్వన్ లోయ ఉదంతం జరిగిందన్నది ఒక అభిప్రాయం.
ఐదేండ్ల తరువాత అదే చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవటం వెనుక పాలకవర్గ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక వైపు చైనాను వ్యతిరేకిస్తున్న జపాన్తో జట్టుకడుతూనే బీజింగ్ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ఇది దేశంలో డ్రాగన్ దేశ వ్యతిరేక శక్తులకు చెంపదెబ్బ వంటిది. గతంలో మాదిరి భారత పాలకవర్గం సోషలిస్టు-వ్యతిరేక శిబిరాల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించి నట్లే ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడుతున్నది. విద్యుత్ రంగంలో చైనాతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాశ్వతంగా అనుమతి ఇచ్చినట్లు కాదని పైకి బింకాలు పోతున్నప్పటికీ చైనా పెట్టుబడుల కోసం మనదేశం ఎంతగా తహతహలాడుతున్నది తెలుస్తోంది. గాల్వన్లోయ ఉదంతాల సమయంలో చైనా వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు అన్నీ మూసుకు కూర్చున్నారు. నరేంద్రమోడీ నాయక త్వంలోని ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలేవీ కూడా సైద్ధాంతికంగా కమ్యూనిస్టు అను కూలమైనవి కాదు.
కానీ వాటికి చైనా వస్తువులు కావాలి. కార్పొరేట్లకు లాభాలు సంపాదించి పెట్టాలనటంలో ఏకాభిప్రా యం ఉంది. ఈ కారణంగానే చైనా దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారు. మనదేశం చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ఇరుదేశాల వాణిజ్యలావాదేవీల విలువ 151 బిలియన్ డాలర్లు కాగా చైనా లెక్కలు 156బి.డాలర్లు అంటున్నాయి. ఇది పెద్ద సమస్య కాదు గానీ చైనాతో మన వాణిజ్యలోటు 112 బిలియన్ డాలర్లు దాటింది, ఇదొక రికార్డు. మన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత నినాదాలు, ఆచరణ వైఫల్యానికి ఇది నిదర్శనం.
కమ్యూనిస్టు చైనా విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే పసిఫిక్ కమాండ్ పేరు మార్చారన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పసిఫిక్ ప్రాంతంపై అదుపుకోసం కమ్యూనిస్టు చైనా ఆవిర్భవించక ముందే 1947 జనవరి ఒకటిన అమెరికా కమాండ్ ఏర్పడింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మనదేశ పశ్చిమ(అరేబియా) తీరం వరకు మిలిటరీతో సహా అనేక కార్యకలాపాల నిర్వహణ దాని లక్ష్యం.కొరియా, వియత్నాంపై దాడులు, ఇతర అనేక దేశాల్లో జోక్యం ఈ కమాండ్ పుణ్యమే. ఎనిమిదేండ్ల క్రితం పేరు మార్చేందుకు సందర్భమేమీ లేనట్లే ఇప్పుడు పూర్వపు నామాన్ని తెరమీదకు తెచ్చేందుకూ సరైన కారణమేమీ లేదు. అమెరికా తన ప్రయోజనానికి ఏది మంచిదనుకుంటే అదే చేస్తుంది.మన దేశ పటాన్ని పాకిస్తాన్కు అనుకూలంగా మార్చినా అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే మన పాలకులకు చీమకుట్టినట్లు లేదు.
జై భజరంగభళీ అంటూ చైనా, పాకిస్తాన్ల మీద వీధుల్లో వీరంగం వేసేవారెవరూ కిక్కురు మనలేదు. లెటర్హెడ్ మీద పేరు మార్చినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదని అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీతో మన బంధం పూర్తి అయింది గనుక దాన్నుంచి బయటపడలేని స్థితి ఏర్పడిందని భావించిన తరువాత అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.చిత్రం ఏమిటంటే ఇప్పుడు లేని ఇండో-పసిఫిక్ కమాండ్కు తాము కట్టుబడి ఉన్నట్లు మనదేశం, జపాన్ చెబుతున్నాయి.జపాన్ అంటే అమెరికా తొత్తు గనుక అదేమైనా చెప్పుకోవచ్చు, మనం కూడా అంతేనా! రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతులెత్తేసిన తరువాత అమెరికా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టింది. దాంతో నాటి సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్సు, చైనా, పాకిస్తాన్, మనదేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయాల్సి వచ్చింది.ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అణ్వా యుధాలేగాక ఆధునిక క్షిపణులతో అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది.
తద్వారా ఆయుధపోటీకి తెరలేపింది. ఆ క్రమంలో ప్రతిదేశం తన రక్షణ కోసం ఆయుధాలను తయారు చేసుకోక తప్పటం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాను అణ్వాయుధ క్షిపణి ప్రయోగం జరపనున్నట్లు అనేక దేశాలకు ముందుగానే సమయం, నిర్దేశిత లక్ష్యం గురించి చైనా తెలియచేసింది. సోమవారం నాడు మధ్యాహ్నం 12.01నిమిషాలకు అణు నియంత్రిత జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం జరపగా 59 నిమిషాల్లో జయప్రదంగా ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ సముద్రంలో నిజమైన బాంబులకు బదులు డమ్మీలతో ఆ ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు జరిపిన దేశాలలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు మనది కూడా ఒకటి.వార్షిక మిలిటరీ శిక్షణలో భాగంగా తామీ పరీక్ష జరిపినట్లు చైనా చెప్పినప్పటికీ జపాన్ వంటి దేశాలు భిన్నంగా స్పందించాయి. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజాయుద్ధ ప్రతిఘటన 80వ వార్షికోత్సవం సందర్భంగా జులాంగ్(జెఎల్) జలాంతర్గామి ప్రయోగించిన క్షిపణిని చైనా తొలిసారిగా 2025 సెప్టెంబరు 3న ప్రదర్శించింది. ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని ఇప్పుడు పరీక్షించింది. గత రెండేండ్లలో ఇలాంటి ప్రయోగాలు చేయటం రెండవసారి.
సోవియట్, తరువాత రష్యా వద్ద కూడా ఇలాంటి అధునాతన వ్యూహాత్మక క్షిపణులు ఉన్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది.ఇప్పుడు రష్యాకు చైనా కూడా తోడైంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు అమెరికా 14, రష్యా 13, చైనా 6, ఫ్రాన్సు 4, బ్రిటన్ 4, మనదేశం వద్ద మూడు ఉన్నాయి. అన్ని దేశాలూ కొత్తగా మరికొన్నింటిని నిర్మించేక్రమంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆత్మరక్షణకు తప్ప ఎదుటి దేశాలపై దాడులు చేసేందుకు అవసరమైన మిలిటరీని కలిగి ఉండకూడదని ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పుడు జపాన్ మార్చుకొని తిరిగి ఆసియాలో ఒక సైనిక శక్తిగా మారేందుకు చూస్తున్నది. అలాంటి దేశంతో మనం చేతులు కలిపి చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటాన్ని గమనించాలి.ఈ పరిణామాలను చూస్తున్నపుడు అటు చైనా, ఇటు దాని వ్యతిరేక కూటమి దేశాలనూ సంతుష్టీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది!
ఎం కోటేశ్వరరావు
8331013288



