Sunday, June 29, 2025
E-PAPER
Homeఆటలుక్యాచ్‌లు చేజారకుండా!

క్యాచ్‌లు చేజారకుండా!

- Advertisement -

– డ్యూక్‌ బాల్స్‌పై సాధన కీలకం
– టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ
– కఠోర కసరత్తు అవశ్యం
– ‘క్యాచ్‌లు మ్యాచులను గెలిపిస్తాయి’.

టెస్టు క్రికెట్‌లోనే కాదు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లోనూ అదే మౌళిక సూత్రం. బౌలర్లు క్రమశిక్షణతో నిలకడగా ఒత్తిడి పెంచితే.. లభించే క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
వికెట్ల వేట ఆశించిన స్థాయిలో లేకపోవటం మైదానంలో ఫీల్డర్లను నైరాశ్యంలోకి నెడుతుంది. క్యాచ్‌లు చేజారటం అంతిమంగా మ్యాచ్‌ మలుపు తిరిగేందుకు దోహదం చేస్తాయి. లీడ్స్‌ టెస్టులో టీమ్‌ ఇండియా ఈ చేదు అనుభవం చవిచూసింది. జులై 2 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టులోనైనా క్యాచ్‌లను ఒడిసిపట్టుకునేందుకు బర్మింగ్‌హామ్‌లో గిల్‌సేన కఠోర సాధన చేయక తప్పదు.
శ్రీనివాస్‌ దాస్‌ మంతటి

ఫీల్డింగ్‌ దారుణం
ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ సైతం పేలవం. ఇరు జట్ల నుంచి ఫీల్డర్లు కీలక క్యాచ్‌లు నేలపాలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్‌ రాహుల్‌ 59 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను హ్యారీ బ్రూక్‌ వదిలేయగా.. రాహుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు భారత ఫీల్డర్లు పలుమార్లు జీవనదానం చేశారు. ఏకంగా స్లిప్స్‌లోనే ఐదు క్యాచ్‌లు జారవిడిచారు. ఒలీ పోప్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ డకెట్‌ క్యాచ్‌లను యశస్వి జైస్వాల్‌ వదిలేశాడు. వీరిలో పోప్‌, డకెట్‌ సెంచరీలు సాధించగా.. బ్రూక్‌ శతకానికి పరుగు దూరంలో నిలిచాడు. జైస్వాల్‌తో పాటు రిషబ్‌ పంత్‌, సాయి సుదర్శన్‌లు విలువైన క్యాచ్‌లు వదిలేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు నేల పాలు కాగా.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లపై ఒత్తిడి తొలగింది. చేజారిన క్యాచ్‌లతో భారత్‌ సుమారుగా 200 పరుగులు కోల్పోవాల్సి వచ్చింది. తొలి టెస్టు ఫలితంపై ఇది చూపించిన ప్రభావం గణనీయం.


ఎందుకీ ఫీల్డింగ్‌ వైఫల్యం?
ఇటీవల టెస్టుల్లో భారత స్లిప్‌ కారిడార్‌లో చురుకైన ఫీల్డర్‌ యశస్వి జైస్వాల్‌. స్వల్ప కెరీర్‌లోనే జైస్వాల్‌ స్లిప్స్‌లో చక్కటి క్యాచ్‌లు అందుకుని జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. మంచి ఫిట్‌నెస్‌, మైదానంలో పాదరసంలా కదిలే జైస్వాల్‌ సైతం క్యాచ్‌లు అందుకోవటంలో దారుణంగా తేలిపోవటం ఆశ్చర్యకరం. అయితే, అందుకు పలు కారణాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు, నిపుణుల అభిప్రాయం. చేతి వేళ్లకు తగిలిన గాయాలకు వేసుకునే పట్టీ, లీడ్స్‌ మైదానం స్లోప్‌తో కూడిన ఉపరితలం, స్టాండ్స్‌లో నల్లని గీతలు, గ్రౌండ్‌లో వెలుతురు లేమి సమస్య వంటిని క్యాచ్‌లు చేజారేందుకు కారణమని తెలుస్తోంది. లీడ్స్‌ టెస్టు స్లిప్‌ కార్డన్‌ ఉపరితలం సమంగా లేదని, స్లోప్‌తో ఉందని క్యాచ్‌లు అందుకోవటంలో ఇబ్బందికి గురి చేసిందని బుమ్రా సైతం వ్యాఖ్యానించాడు.
డ్యూక్‌ బాల్స్‌తో కష్టం
క్యాచ్‌లు చేజారటంలో ఇంగ్లాండ్‌లో టెస్టులకు వాడే బంతులు సైతం ఓ కారణం. భారత్‌లో వినియోగించే ఎస్‌జీ బంతులు మృదువుగా ఉంటాయి. చేతిలో చక్కగా అమరుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సహా పాకిస్తాన్‌లో టెస్టుల్లో కూకాబురా బంతిని వాడుతారు. ఇది కాస్త చిన్నగా అనిపించటంతో పాటు చక్కగా చేతుల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇంగ్లాండ్‌లో వాడే డ్యూక్‌ బాల్స్‌ అందుకు విరుద్ధం. కఠినంగా, కాస్త పెద్దగా అనిపిస్తాయి. డ్యూక్‌ బాల్స్‌ను ఫీల్డింగ్‌లో అందుకోవటం అంత సులువు కాదు. ప్రాక్టీస్‌ సెషన్లో సైతం కాస్త ఇటు అయితే చేతి వేళ్లకు గాయాలు అవుతాయి. యశస్వి జైస్వాల్‌ అందుకే చేతికి పట్టీ వేసుకుని ఫీల్డింగ్‌ చేశాడు. ఇలా పట్టీతో ఉన్నప్పుడు క్యాచ్‌ అందుకోవటం మరింత కష్టతరం. చేతి వేళ్లను స్వేచ్ఛగా కదించలేని పరిస్థితికి తోడు బంతి పట్టీకి తగిలి చేతిలో నుంచి పడిపోతుంది. అందుకే, యశస్వి జైస్వాల్‌ నాలుగు క్యాచ్‌లు వదిలేసినా.. చెత్త ఫీల్డర్‌ అంటూ నిందలు వేయవద్దని భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ సహా మాజీ క్రికెటర్లు మహ్మద్‌ కైఫ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ అంశంలో సాంకేతిక సమస్యలను పంచుకున్నారు.

పరిస్థితులూ ఓ సవాలే
ఇంగ్లాండ్‌లో శీతల వాతావరణ పరిస్థితులు సహజం. టెస్టు మ్యాచ్‌ ఉదయం 11 గంటలకు మొదలైనా.. చలిలో ఫీల్డింగ్‌ ఎంతో సవాల్‌తో కూడుకున్నది. స్వల్ప ఉష్ణోగ్రతలతో ఆటగాళ్లు తిమ్మిర్లకు గురవుతారు. దీంతో స్లిప్స్‌లో రెప్పపాటులో అందుకోవాల్సిన క్యాచ్‌లు వాతావరణ పరిస్థితుల కారణంతో నేల పాలు అవుతున్నాయి. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు సైతం ఈ పరిస్థితుల్లో తడబాటుకు గురవుతున్నారంటే భారత ఫీల్డర్ల కష్టాలను అర్థం చేసుకోవచ్చు. దీనికి పరిష్కారం.. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్లో ఫీల్డింగ్‌ డ్రిల్స్‌లో కఠోరంగా శ్రమించాలి. డ్యూక్‌ బాల్స్‌ను అందుకునేందుకు పరిస్థితులకు తగినట్టు మార్పులు చేసుకోవాలి. వీలైనంత వేగంగా డ్యూక్‌ బాల్స్‌కు అలవాటు పడాలి.

సాధనతోనే సమస్యకు చెక్‌
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో పంత్‌, జడేజా, రాహుల్‌, బుమ్రా, శార్దుల్‌, గిల్‌ మినహా ఇతర క్రికెటర్లకు ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులపై ఆడిన అనుభవం లేదు. ఇది టీమ్‌ ఇండియా ఎదుర్కొంటున్న మరో సమస్య. జాతీయ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్లు కొత్త పరిస్థితులకు అలవాటు పడాలి. రెండో టెస్టు మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు గిల్‌సేన ఫీల్డింగ్‌, క్యాచ్‌లపై ఫోకస్‌ పెట్టాలి. మ్యాచ్‌ సిములేషన్స్‌లో క్యాచ్‌లను సైతం భాగం చేయాలి. స్పిన్‌, పేస్‌పై స్లిప్స్‌లో క్యాచ్‌లను సుదీర్ఘ సెషన్ల పాటు ప్రాక్టీస్‌ చేయాలి. 30 యార్డ్‌ సర్కిల్‌ ఆవల క్యాచ్‌ల సాధనకు రిలే క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. గాయాలు తగిలినప్పుడు చేతికి పట్టీ వేసుకున్నా.. ఒడుపుగా క్యాచ్‌లు అందుకునేలా ఫీల్డింగ్‌ డ్రిల్స్‌ రూపకల్పన ఉండాలి. అప్పుడే బర్మింగ్‌హామ్‌లో టీమ్‌ ఇండియా క్యాచ్‌లు జారవిడిచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

ఎడ్జ్‌బాస్టన్‌లో జాగ్రత్త
తొలి టెస్టు వేదిక లీడ్స్‌తో పోల్చితే రెండో టెస్టు వేదిక ఎడ్జ్‌బాస్టన్‌ తొలి రెండు రోజుల్లో పేస్‌కు అందించే అనుకూలత అధికం. ఫలితంగా, తొలి రెండు రోజులు స్లిప్స్‌లో క్యాచ్‌ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌పై పచ్చిక సైతం ఎక్కువగా ఉంచుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలమైనా పిచ్‌ అయినా.. ఆరంభంలో బౌలర్లకు సహకరిస్తుంది. మిస్‌ఫైర్‌ షాట్లు సహా ఎడ్జ్‌లతో స్లిప్స్‌లో క్యాచౌట్‌ అవకాశాలు ఎక్కువ. ఇక్కడి గ్రౌండ్‌ ఉపరితలం సమతలంగా ఉండటంతో స్లిప్‌ కార్డన్‌లో ఫీల్డర్లకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ పరిస్థితులను
శుభ్‌మన్‌ గిల్‌ సేన సద్వినియోగం చేసుకుంటే ఫలితంలో వ్యత్యాసం రాబట్టవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -