విదేశాలతో సంబంధం లేదు
అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ
న్యూఢిల్లీ : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ల డీకోడింగ్పై విదేశాలపై ఆధారపడే భారత్.. ఇప్పుడు అవుట్సోర్సింగ్(విదేశాలు)తో సంబంధం లేకుండా పూర్తిగా దేశీయంగానే దర్యాప్తును జరుపుతున్నది. ఏఐ-171 విమాన ప్రమాద ఘటనపై పూర్తి దేశీయ సామర్థ్యంతోనే దర్యాప్తు సాగించనున్నది. ఇందులో భాగంగా ది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ-171కు చెందిన బ్లాక్ బాక్స్ను తొలిసారి పూర్తిగా దేశంలో డీకోడ్ చేస్తున్నది.
న్యూఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్లో దీని దర్యాప్తు సాగుతున్నది. విమానం క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యుల్ (సీపీఎం) నుంచి మెమోరీ మాడ్యుల్ను విజయవంతంగా యాక్సెస్ చేసి, ఈనెల 25న ఏఏఐబీ ల్యాబ్లో డేటాను డౌన్లోడ్ చేసినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానం కూలిన భవనం, అక్కడి శిథిలాల నుంచి కాక్పీట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ (సాధారణంగా బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు)లను ఈనెల 13 నుంచి 16 మధ్య స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. డేటా సంగ్రహణ కచ్చితమైనదని నిర్ధారించటానికి ”గోల్డెన్ చాసిస్” అని పిలువబడే ఐడెంటికల్ బ్లాక్బాక్స్ను ఉపయోగించినట్టు అధికారులు చెప్పారు. సాంకేతిక బృందంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, హిందుస్తాన్ ఎయిరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), విమానం తయారీ దేశంగా సహాయం చేస్తున్న అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ప్రతినిధులు ఉన్నారు.
ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మద్దతుతో ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతున్నది. సాంకేతిక ప్రక్రియకు సహాయం చేయటానికి బోయింగ్, జీఈకి చెందిన బృందాలు ఢిల్లీలో ఉన్నారు. భారత్ దేశీయంగా బ్లాక్బాక్స్లను ఇలా డీకోడ్ చేయటం ఇదే మొదటిసారి. ఇటీవలి వరకు రష్యా, యూకే, యూఎస్, కెనడా వంటి దేశాలలో బ్లాక్ బాక్స్ డీకోడింగ్ జరిగింది. దీంతో ఆలస్యం, పారదర్శకత గురించి ఆందోళనలు తలెత్తేవి. ఈనెల 12న అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాద ఘటనలో 241 మంది చనిపోయిన విషయం విదితమే.