నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్-యమునోత్రి రోడ్డు బలిగఢ్లో ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో నిర్మాణంలో ఉన్న హోటల్ కూలిపోయింది. తొమ్మిది మంది కార్మికులు గల్లంతైయ్యారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మేఘాల విస్ఫోటనం సంభవించింది.
రాష్ట్ర విపత్తు, జాతీయ విపత్తు బృందాలను పోలీసులు సంఘటనా స్థలానికి తరలించారు. ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే దారిలో బార్కోట్ ప్రాంతంలోని సిలై బెండ్ సమీపంలో భారీ వర్షం, క్లౌడ్ బరస్ట్ కారణంగా కార్మికులు అదృశ్యమయ్యారని స్థానిక విపత్తు నియంత్రణ అధికారులు తెలిపారు. గల్లంతైన వారందరూ నేపాలీకి చెందినవారని తెలుస్తోంది. వారి ఆచూకి కోసం అధికారులు గాలింపులు చేపట్టారు. ఆదివారం, సోమవారం ఉత్తరకాశిలో రెడ్ అలర్ట్ కేంద్ర వాతావరణ శాఖ జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
