Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్థాయి మరిచి వ్యాఖ్యలు చేయడం సరికాదు

స్థాయి మరిచి వ్యాఖ్యలు చేయడం సరికాదు

- Advertisement -

– ‘కొండా’పై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం
– క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డిపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా మురళి హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆదివారం హన్మకొండ జిల్లా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ.. వరంగల్‌ నగరాభివృద్ధిపై భేటీ అయిన క్రమంలో కొండా మురళి హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై చర్చించినట్టు చెప్పారు. క్రమశిక్షణా సంఘం పిలిస్తేనే కొండా మురళి ఆ సమావేశానికి హాజరయ్యారని, తనంతట తానే వెళ్లినట్టు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. రామసహాయం సురేందర్‌రెడ్డిపై కామెంట్స్‌ చేసే స్థాయి తనది కాదన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే తిట్టే సంస్కృతి ‘కొండా’ దంపతులదేనన్నారు. 1996లో ఎంపీగా ఓడిపోయాక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామసహాయం సురేందర్‌రెడ్డికి డీలిమిటేషన్‌లో సీటు లేకుండా చేశానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 1996లో రాజకీయాల నుంచి సురేందర్‌రెడ్డి తప్పుకున్నాక 12 ఏండ్ల తర్వాత డీలిమిటేషన్‌ జరిగిందన్నారు. డీలిమిటేషన్‌ చేయడం మీ చేతుల్లో ఉందా అని ప్రశ్నించారు. పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని, వర్ధన్నపేటలో నాగరాజును గెలిపించానని చెప్పడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటమెరుగని నాయకులుగా చెప్పుకుంటున్న కొండా సురేఖ పరకాలలో, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో పలుమార్లు ఓడిపోయిందన్నారు. కొండా మురళి.. 2001లో సంగెంలో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడు పోటీ చేయలేదని తెలిపారు. సురేఖ ‘తూర్పు’లో 9 వేల మెజార్టీతో గెలిచాక పార్లమెంటు ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో బీజేపీకి మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. టీడీపీలో దయాకర్‌రావు శిష్యునిగా ఉన్న కొండా మురళి తరువాత కాంగ్రెస్‌లో చేరుతానంటే రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లానన్నారు. ప్రాణభయం ఉందంటే డీజీపీ వద్దకు మురళిని రామసహాయం సురేందర్‌రెడ్డి తీసుకువెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. అటువంటి సురేందర్‌రెడ్డి బంధువు ఉమ్మడి వరంగల్‌ ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిట్టడం ఫ్యాషన్‌ అయిపోయిందని, పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడటం మానేయాలని అన్నారు. కొండా మురళి వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని క్రమశిక్షణా సంఘం కచ్చితంగా జులై 5వ తేదీలోపు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మెన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -