నవతెలంగాణ-హైదరాబాద్: హత్యాయత్నం కేసులో గుజరాత్ ఆప్ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. పంచాయితీ కార్యకర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే చైతర్ వాసవను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. శనివారం రాత్రి వాసవ నియోజకవర్గం దేడియాపాడులో జరిగిన సమావేశంలో ఘర్షణ నెలకొంది. స్థానిక స్థాయి సమన్వయ కమిటీ ‘ఆప్నో తాలూకో వైబ్రంట్ తాలూకో (ఎటివిటి)లో నియామకం కోసం తన నామినీని నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. పంచాయితీ మహిళా ప్రెసిడెంట్ను దుర్భాషలాడటంతో పాటు పంచాయితీ అధ్యక్షుడిపై దాడికి దిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పంచాయితీ కార్యాలయం ఆస్తులను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అయితే ముందుగా తనపై మొబైల్ ఫోన్ విసిరారని, తలకి గాయాలయ్యాయని, అనంతరం గాజు గ్లాస్తో కొట్టేందుకు యత్నించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అరెస్ట్ను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఖండించారు. విశావదర్ ఉప ఎన్నికలో ఆప్ ఇటీవల విజయం సాధించడంతో ఆప్ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఇది బిజెపి రాజకీయ ప్రతీకార దాడిగా అభివర్ణించారు. దాడులతో ఆప్ భయపెట్టాలని భావిస్తే అది తప్పని అన్నారు. బిజెపి గూండాయిజం, నియంతృత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఇటువంటి వ్యూహాలకు వారే తగిన సమాధానం ఇస్తారని అన్నారు.