ఫామ్హౌజ్లోనే మాక్ అసెంబ్లీ పెడదాం
చట్టసభల్లోనే చర్చలు : ప్రజాభవన్ పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ అనుబంధం మూలంగానే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వాదించి ఉంటే హైదరాబాద్కు తాగునీటిని సాధించే వాళ్లమని అభిప్రాయపడ్డారు. కృష్ణాజలాల అంశంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్కు సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ బేసిన్లు లేవు, బేషజాలు లేవని కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించుకోవచ్చన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. జగన్కు సూచనలతోపాటు టెండర్లు, జీవోలు ఇచ్చేలా సహకరించారు. ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్కు తాగునీటి జలాలను వేరు చేయాల్సి ఉంది. నగరంలో ఏపీ ప్రజలు 20 శాతం వరకూ ఉన్నారు
. హైదరాబాద్కు ఉమ్మడి జలాల నుంచి తాగునీరిచ్చేలా కేసీఆర్ చర్చించాల్సి ఉంది. మిగిలిన జలాలను పరివాహక ప్రాంతాలకు పంపకాలు చేసి ఉంటే బాగుండేదన్నారు. తుంగభద్ర, కృష్ణా, బీమా జలాలు తొలుత గద్వాలకు వస్తాయి. తెలంగాణకు వచ్చిన వెంటనే ఒడిసిపట్టుకోవాల్సి ఉంది. వెంటనే పాలమూరు-రంగారెడ్డి , నల్లగొండ ఇతర ప్రాంతాలకు తరలించాలి. తెలంగాణ వదిలితేనే ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు వెళ్తాయి. రాష్ట్రానికి వచ్చినప్పుడు వదిలేసి ఏపీ నుంచి తిరిగి వచ్చాక చివరకు తీసుకునేలా చేశారు. రాయలసీమకు వెళ్లిన జలాలను ఏపీ ఒడిసిపట్టుకుంటున్నది. జూరాల నుంచి తెచ్చుకుంటే ఏపీ జలాలను కొల్లగొట్టే అవకాశం ఉండేది కాదు. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంతాల రైతులకు మరణశాసనంగా మారాయి. ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి వాటా వస్తే తక్కువ ధరకు విద్యుత్ దక్కేది’ అని సీఎం అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ వెయ్యి రెట్ల ద్రోహం
”ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికి వెయ్యి రెట్లు కేసీఆర్ ద్రోహం చేశారు. సీమాంధ్ర పాలకులకు ఒక కొరడా దెబ్బ పడితే, కేసీఆర్ను వెయ్యి దెబ్బలు కొట్టాలి. గతంలో పాలమూరు-రంగారెడ్డి సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి తగ్గించారు. ఏడాదికి కిలోమీటర్ టన్నెల్ పూర్తిచేసి ఉంటే ఎస్ఎల్బీసీ పూర్తయ్యేది. గతంలో రూ. 1000 కోట్ల ప్రాజెక్టు అంచనా రూ. 3000 కోట్లకు పెరిగింది. 3.64 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారు. కృష్ణా జలాలను దారిదోపిడీ చేసే అవకాశం ఏపీకి కేసీఆర్ ఇచ్చారు” అని సీఎం విమర్శించారు.
ఎర్రవల్లిలో మాక్ అసెంబ్లీ
”కేసీఆర్ పాలనలో నిర్ణయాలు, మా పాలనలో నిర్ణయాలపై చర్చిద్దాం. వీధుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చిద్దామన్నా.. దయచేసి నన్ను క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దు..నేను రాను కేసీఆర్ ఏ తేదీ చెబితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం.. స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తాం.. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా..ఎలాంటి గందరగోళం లేకుండా సభ నిర్వహిస్తాం.. ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చ నిర్వహిద్దాం..కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఆయన ఆరోగ్యంగా ప్రజాజీవితంలో ఉండాలి. కేసీఆర్కు ఇబ్బంది లేకుంటే ఎర్రవెల్లి ఫామ్హౌజ్లోనే చర్చపెడదాం. అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. నాకేమీ భేషజాలు లేవు. కేసీఆర్ నాకంటే చాలా సీనియర్. నేను కూడా రావాలని కోరుకుంటే తప్పకుండా వెళ్తా. ఫామ్హౌజ్లో భేటీకి కేసీఆర్ తేదీ నిర్ణయించి చెప్పాలి. ఎర్రవెల్లికి మంత్రుల బృందాన్ని పంపిప్తా. కేసీఆర్కు ఇబ్బంది లేకుండా అక్కడే చర్చిద్దాం” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు.
గొడవలను గమనిస్తున్నారు
”నేపాల్లో ఓ యువరాజు కుటుంబంలో అందర్నీ చంపి రాజయ్యాడు. కేసీఆర్ కుటుంబంలో సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. కులపెద్దలు, పెద్ద మనుషులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కేసీఆర్ కుటుంబ గొడ వలు వీధి బాగోతాల్లా ఉన్నాయి. బావ, బావమరిది, చెల్లి గొడవలను జనం గమనిస్తున్నారు” అని సీఎం అన్నారు.
వాటిని పూర్తిచేస్తే కృష్ణా జలాల్లో న్యాయం జరిగేది ఎన్డీఎస్ఏ ప్రకారం బ్యారేజీల పునురుద్ధరణ : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
గత పదేండ్లల్లో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘1976లో బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసింది. మూడు రాష్ట్రాలకు 2130 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఏపీ 811, కర్నాటక 734, మహారాష్ట్రకు 585 టీఎంసీలు ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత కేంద్రం ఆమోదం లేకుడా ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, పాలమూరు-రంగారెడ్డి, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టులు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా పూర్తిచేయలేదు. ఈ ప్రాజెక్టులు గత పదేండ్లల్లో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాలల్లో న్యాయం జరిగేదని’ వ్యాఖ్యానించారు.
సామర్థాన్ని పెంచుకుంది
‘ఆల్మట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ హయాంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. తెలంగాణకు 575 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాం. ఏపీకి 236 టీఎంసీలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. గత ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చెప్పింది. 2016లో అపెక్స్ కౌన్సిల్కు 66:34 శాతంపై లిఖతపూర్వకంగా రాసి ఇచ్చారు. 2025 మార్చిలో తెలంగాణకు 71 శాతం కృష్ణా జలాలు ఇవ్వాలని లేఖ రాశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువ అన్యాయం జరిగింది. మల్యాల సామర్థ్యాన్ని 3850 నుంచి 6300 క్యూసెక్కులకు పెంచారు. 2017లో రాయలసీమకు రోజూ 1.09 టీఎంసీలు తీసుకునే సామర్థ్యాన్ని ఏపీ పెంచుకుందని’ ఉత్తమ్ చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్ వాయిదా
‘2020లో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 92 వేల క్యూసెక్కులకు ఏపీ పెంచుకుంది. జగన్ హయాంలో గోదావరి, కృష్ణా జలాలపై ప్రగతిభవన్లో చర్చించారు. శ్రీశైలం నుంచి ఏపీకి కృష్ణాజలాల తరలింపునకు పునాదులు పడ్డాయి. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే శ్రీశైలం, సాగర్ అవసరాలపై వినాశన ప్రభావం ఉంటుంది.
నాగార్జునసాగర్ ఆయకట్టు పూర్తిగా ఏడారిగా మారే ప్రమాదం ఉంది. 2020లో ఏపీకి మేలు చేసేలా కుట్రపూరిత చర్యలు చేపట్టారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయక ముందే హాజరైతే బాగుండేది. రాయలసీమ టెండర్లపై కేంద్రం స్టే విధించేలా చర్యలు ఉండేవేమో, రాయలసీమ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తికి గత ప్రభుత్వం సహకరించింది. 2019కి ముందే పాలమూరు పూర్తిచేసి ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేది’ అని ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు.