– రేపు ఇందిరాపార్క్ వద్ద బీసీ గర్జన
– పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనీ, స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకిచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ పెద్ద ఎత్తున మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.