– ఓటింగ్ను పెంచే నిధులకు ‘డోజ్’ కత్తెర
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడే లక్ష్యంగా రూపొందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వివిధ దేశాలకు అమెరికా అందించే నిధులకు కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లను రద్దు చేసినట్టు పేర్కొన్నది. డోజ్.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
కోతలపై బీజేపీ స్పందన
డోజ్ విభాగం తాజా నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ”ఓటర్లు సంఖ్య పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల? ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష భాగం కాదు. దీని నుంచి ఎవరు లాభపడుతున్నారు? అధికార పార్టీ మాత్రం కాదు” అని మాలవీయ ఎక్స్లో రాసుకొచ్చారు.
బంగ్లాదేశ్కూ 29 మిలియన్ డాలర్ల కోత
బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు అందిస్తున్న 29 మిలియన్ డాలర్లకు కూడా డోజ్ కోత విధించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇక నేపాల్, కంబోడియా వంటి పలు ఆసియా పలు దేశాలకు కూడా వివిధ రూపాల్లో అమెరికా అందించే సాయాన్ని నిలిపివేశారు.