– గచ్చిబౌలి స్టేడియంను పరిశీలించిన ఫిఫా ఉన్నతాధికారులు
హైదరాబాద్ : భారత్లో ఫిఫా తన రెండో ఫుట్బాల్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది!. ఈ మేరకు ఫిఫా ఉన్నతాధికారుల బృందం బుధవారం హైదరాబాద్లో పర్యటించారు. భువనేశ్వర్లో ఇప్పటికే ఫిఫా టాలెంట్ డెవలెప్మెంట్ స్కీమ్ (టీడీఎస్) అకాడమీ కార్యకలాపాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించటంతో గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా టీడీఎస్ అకాడమీ ఏర్పాటు యోగ్యత, సౌకర్యాలు, సదుపాయాలపై ఫిఫా డైరెక్టర్ జెడ్ రాడీ సహా ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి అనిల్ కుమార్ సహా టెక్నికల్ డైరెక్టర్ షబ్బిర్ పాష, ఈసీ మెంబర్ షబ్బిర్ అలీలు బుధవారం గచ్చిబౌలి స్టేడియంను పరిశీలించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఎండీ సోనీబాలా దేవి సహా డిప్యూటీ డైరెక్టర్లు ఫిఫా అకాడమీ ఏర్పాటుకు అనుకూలతలను జెడ్ రాడీకి వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో జెడ్ రాడీ భేటీ అయ్యారు. హైదరాబాద్ను ఫుట్బాల్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని శాట్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి తెలిపారు.