క్రైస్ట్చర్చ్ : చివరి రోజు ఆట. చివరి సెషన్. ఆఖరు ఓవర్. ఆఖరు బంతి వరకూ ఉత్కంఠగా సాగిన శ్రీలంక, న్యూజిలాండ్ తొలి టెస్టులో ఆతిథ్య కివీస్ 2 వికెట్ల తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. 285 పరుగుల ఛేదనలో వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు. దీంతో తొలి టెస్టులో డ్రా ఫలితం తప్పదేమో అనిపించింది. కానీ డార్లీ మిచెల్ (81), కేన్ విలియమ్సన్ (121 నాటౌట్) భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన టెస్టులో శ్రీలంక బౌలర్లు సైతం వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్పై ఒత్తిడి పెంచారు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా.. కేన్ విలియమ్సన్ మూడో బంతికి బౌండరీ బాది కివీస్ శిబిరంలో వాతావరణం తేలిక పరిచాడు. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా.. విలియయ్సన్ వెంట్రుక వాసి తేడాతో రనౌట్ నుంచి తప్పించుకుని ఉద్విగ విజయాన్ని అందించాడు. శ్రీలంక వరుసగా 355, 302 పరుగులు చేయగా.. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 373 పరుగులు చేసింది.