నార్త్‌జోన్‌ 198ఆలౌట్‌, సౌత్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ

బెంగళూరు: దులీప్‌ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌ బౌలర్లు సత్తాచాటాడు. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభమైన దులీప్‌ట్రోఫీ సెమీస్‌లో సౌత్‌జోన్‌ బౌలర్ల దెబ్బకు నార్త్‌జోన్‌ జట్టు 198పరుగులకే ఆలౌటైంది. కవిరప్ప(5/28), శశికాంత్‌(2/52) బౌలింగ్‌లో మెరిసారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ధృవ్‌ షోరే(11), ప్రశాంత్‌ చోప్రా(5), అంకిత్‌ కల్సి(2) నిరాశపరిచారు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(49), అంకిత్‌ కుమార్‌(33), నిషాంత్‌(27) బ్యాటింగ్‌లో రాణించారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ హర్షీత్‌ రాణా(31), వైభవ్‌ అరోరా(23) ఫర్వాలేదనిపించారు. దీంతో నార్త్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58.3ఓవర్లలో 198పరుగులకు కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ జోన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 63పరుగులు చేసింది. బల్జీత్‌ సింగ్‌, హర్షీత్‌ రాణాకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆలూరు కప్కా క్రికెట్‌గ్రౌండ్‌లో సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్‌జోన్‌ జట్టు బ్యాటర్స్‌ రాణించారు. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 216పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా(26)కి తోడు పుజారా(28), అతిత్‌ సేఠ్‌(74), ధర్మేంద్రసింగ్‌(39) బ్యాటింగ్‌లో రాణించారు. శివమ్‌ మావికి నాలుగు, ఆవేశ్‌ఖాన్‌, యష్‌ ఠాకూర్‌, సౌరభ్‌ కుమార్‌, సరంశ్‌ జైన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

Spread the love