రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికల అనంతర సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశచూపి, ఓటర్ల పేర్లను ప్రయివేటుగా నమోదు చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రకటనలు, సర్వేలు లేదా యాప్ ద్వారా ఇలాంటి నమోదుకు సంబంధించిన కార్యకలాపాలను ఆపివేయాలని దేశంలోని అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలను ఈసీ కోరింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతర ప్రయోజనాల వాగ్దానాన్ని ప్రోత్సహిస్తే ఓటర్లు, వాగ్దానం చేసినవారి మధ్య ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఏర్పడుతుందని, ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తుందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఈ విధానం ఓటర్లు, వాగ్దానం చేసే వ్యక్తుల మధ్య రాజీకి దారితీయవచ్చుని పేర్కొంది. సాధారణ ఎన్నికల వాగ్దానాలకు అనుమతి ఉన్నప్పటికీ.. పథకాల ఆశచూపి ఇప్పుడే ఓటర్ల పేర్లు నమోదు చేసుకుంటే నిజమైన సర్వేలు, రాజకీయ లబ్ధి చేకూర్చే పక్షపాత ప్రయత్నాల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారుతుందని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రయత్నాలు చట్టబద్ధమైన సర్వేలు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ అజెండాలకు సంబంధించిన కార్యకలాపాలుగా కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని జిల్లా ఎన్నికల అధికారులకు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని ఎన్నికల సంఘం వివరించింది.

Spread the love