టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
అసత్యపూరిత వ్యాఖ్యలు
కేటీఆర్కు క్షమాపణ చెప్పాలని కోరిన న్యాయవాదులు
లేకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమనీ, నిరాధారమైనవనీ, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8న బండి సంజయ్ ఓ పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. ఈ నోటీసులో బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. బండి సంజయ్ తన హౌదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకే అడ్డగోలుగా ఆయన పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలందించారనీ, అయితే బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతున్నదని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే, ఒక పార్లమెంటు సభ్యునిగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపై అసత్యమైన, అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కేటీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ, కేటీఆర్, అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని న్యాయవాదులు నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల కారణంగా కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES