నవతెలంగాణ – ఆత్మకూరు : అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా నిర్మించనున్న క్రీడామైదానాలతో ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల రూపు రేఖలు మారిపోనున్నాయని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
మంగళవారం అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలలో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి స్థల పరిశీలన చేశారు. దాదాపు రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో అమర్చింతలో నిర్మించనున్న మినీ స్టేడియంలో ప్రస్తుత జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించేందుకు స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఉన్నత పాఠశాల తరగతి గదులను నూతన భవనం లోనికి మార్చి ప్రస్తుతం ఉన్న స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మినీ స్టేడియం నిర్మించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు.
మినీ స్టేడియంలో షటిల్ కబడ్డీ వంటి ఆటలకు ఇండోర్ స్టేడియం సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జాతర మైదానం పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక మినీ స్టేడియం, అదేవిధంగా జాతర మైదానంలో నడక వ్యాయామ దారులకు సౌకర్యాలు ఆధునీకరించడంతో పాటు పక్కనే ఒక ఇండోర్ స్టేడియం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ క్రీడా మైదానాలకు దాదాపు 5 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ తీసుకొని 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అదేవిధంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు సైతం స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అమర్చింత, ఆత్మకూరు లో నిర్మించనున్న క్రీడా మైదానాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి స్పోర్ట్స్ అథారిటీకి సమర్పిస్తే నెలరోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో క్రీడా మైదానాలు పూర్తి అయితే ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల రూపు రేఖలు మారిపోయాయని తెలియజేశారు.
అనంతరం ఆగస్టు 25న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియం టెన్నిస్ క్యాంప్లెక్స్ లో నిర్వహించనున్న సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ పోస్తరును మంత్రి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి, స్పోర్ట్స్ అథారిటీ కార్యనిర్వహక ఇంజనీరు అశోక్, డి.డి. చంద్రా రెడ్డి, రవితేజ, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, తహసిల్దార్ చాంద్ పాషా, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలను తీర్చిదిద్దుతాం : మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES