ఈ సమాజంలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కృతజ్ఞతలు మాత్రమే కాదు. అలాంటి మంచి పని మరొక ముగ్గురు, ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్ళాలని చక్కటి సందేశం ఇచ్చిన చిత్రం ‘స్టాలిన్’. చిరంజీవి కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మించారు. ఈనెల 22 చిరంజీవి పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని 4కె ఫార్మెట్లో రీ-రిలీజ్ చేయబోతున్నట్టు మెగాస్టార్ స్వయంగా ప్రకటించి, తన అభిమానులను, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, ‘స్టాలిన్’ విడుదలై రెండు దశాబ్దాలు కావొస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత నా పుట్టినరోజున మీ ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి నిర్మాత నాగబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇది మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవానుగా దేశ సరిహద్దుల్లో శత్రువుతో పోరాడటమే కాదు. దేశం లోపల ఉన్న శత్రువులతోనూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హీరో స్టాలిన్ రంగంలోకి దిగుతాడు. ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు. ఈతరం ప్రేక్షకులకు వినోదంతోపాటు, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చాటి చెబుతుందీ చిత్రం. ఇందులో నటించిన ఖుష్బూ, త్రిష ఇతర నటీనటులు, స్వరబ్రహ్మ మణిశర్మ,. దర్శకుడు ఏఆర్ మురుగదాస్కు, కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు, నా తమ్ముడు, నిర్మాత నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం మీ అందరికీ మంచి అనుభూతి ఇస్తుందనటంలో ఎలాంటి సందేశం లేదని నమ్ముతున్నాను’ అని చెప్పారు.
సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పిన ‘స్టాలిన్’
- Advertisement -
- Advertisement -