Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeప్రత్యేకంవిశ్వమాత మదర్‌ థెరిసా

విశ్వమాత మదర్‌ థెరిసా

- Advertisement -

ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహౌన్నత వ్యక్తి మదర్‌ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహొన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్‌ థెరిసా అసలు పేరు ఆగెస్‌ గోన్సా బొజాక్ష్యూ. మదర్‌ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది.
తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్‌ థెరిసా… అనారోగ్యంతో తండ్రి 1919లో కన్నుమూయగా, మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్‌.. తన 18వ ఏట సిస్టర్స్‌ ఆఫ్‌ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని స్కూల్‌కు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.
అనాథల కోసం మొతిజిల్‌ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ స్కూలుకు సాయం లభించడంతో 1950లో వాటికన్‌ అనుమతితో ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’ ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్‌ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్‌ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఇక, భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది. థెరీసా సేవలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్‌, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు.
జాయన్‌ గ్రాఫ్‌ క్లూకాస్‌ రాసిన జీవితచరిత్ర ప్రకారం12 ఏళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధులు, వద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయిల్‌ – పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్‌ క్రాస్‌ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు.
1997న మార్చి 13న మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్‌ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్‌ థెరీసాకు సెయింట్‌హుడ్‌ హౌదా కూడా దక్కింది.
ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడుతున్నవారిని అక్కున చేర్చుకున్న అమ్మ. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్‌ థెరీసా సేవలతో కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మథర్‌ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు.
అయితే, లక్షలాది మంది ప్రజలు, ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ విమర్శలను కూడా ఎదుర్కొని.. వాటికి తన సేవతో సమాధానం చెప్పారు. క్రిస్టఫర్‌ హిచెన్స్‌, మిఖాయెల్‌ పరేంటి, అరూప్‌ ఛటర్జీ వంటి వక్తలు, విశ్వ హిందూ పరిషత్‌ వంటివి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం చేస్తున్నారని ఆరోపించాయి.
1952లో కోల్‌కతాలో ‘హౌమ్‌ ఫర్‌ ది డయింగ్‌ ను ప్రారంభించారు. భారత అధికారుల సహాయ సహకారాలతో పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చివేశారు. ఆమె దానికి కాళీఘాట్‌ పరిశుద్ధ హదయ నిలయం ‘నిర్మల్‌ హదరు’గా పేరు పెట్టారు. ఈ నిలయానికి వచ్చేవారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మలను అనుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad