నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్లప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి శివానంద యోగా, ఆధ్యాత్మిక సాధనకు అంకితమైన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆయన మరణం కాశీవాసులతో పాటు లక్షలాది మంది అనుయాయులకు తీరని లోటని అన్నారు.
1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో నిరుపేద కుటుంబంలో శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయారు. పశ్చిమ బెంగాల్లోని నవద్వీప్లో గురు ఓంకారానంద గోస్వామి ఆశ్రమంలో పెరిగారు. యోగా రంగంలో ఆయన సేవలు గుర్తిస్తూ 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2019లో బెంగళూరులో యోగా రత్న అవార్డు సహా ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు.