– ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్
– కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
విద్యార్థినిల కోసం భోజనం తయారు చేసే ముందు వంట పాత్రలను శుభ్రంగా కడగాలని మండల ప్రత్యేక అధికారి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినిల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ఆయన తనిఖీ చేశారు. శుభ్రమైన వాతావరణంలో కలుషితం కాకుండా భోజనాన్ని సిద్ధం చేయాలని నిర్వహకులకు సూచించారు. విద్యాలయంలో ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.
విద్యార్థులకు భోజనం అందించడం పూర్తయిన తర్వాత వంట పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచాలని, వంట చేసే ముందు మరోసారి వాటిని శుభ్రంగా కడగాలని సూచించారు.విద్యాలయం కోసం ప్రభుత్వం నుండి సరఫరా అయిన వంట సరుకులను ఆయన పరిశీలించారు.అనంతరం విద్యాలయంలో రికార్డులను పరిశీలించి, ప్రత్యేక అధికారిని గంగామణికి పలు సలహాలు, సూచనలు చేశారు.తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి విద్యాలయంలో, హాస్టల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసేముందు చేతులను శుభ్రంగా కడుకోవాలని విద్యార్థినులకు సూచించారు.వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంటుందని, వంట గదితో పాటు విద్యాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.