నవతెలంగాణ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధరించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు.
22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఔట్లో 4 పార్కులుండగా 2 కబ్జా(దాదాపు 8,500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. వీటికి తోడు.. 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. సుమారు రూ.400 కోట్ల విలువ చేసే 16,000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1995లో అనుమతి పొందిన ఈ లేఔట్ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. వెనువెంటనే పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బోర్డులు కూడా పెట్టారు. కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీసు కేసులు పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.