నవతెలంగాణ – హైదరాబాద్: గతేడాది టీ20 ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచిన అఫ్ఘానిస్థాన్ జట్టు, ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఆసియా కప్ 2025 సమరానికి సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ కోసం స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గత సంవత్సరం వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో అఫ్ఘానిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ఐసీసీ టోర్నీ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్కు చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి సంచలనం రేపింది. ఇప్పుడు అదే జోరుతో ఆసియా కప్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో హాంగ్కాంగ్తో ఆఫ్ఘనిస్థాన్ తలపడనుంది. అఫ్ఘాన్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఇదే గ్రూప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్కాంగ్ జట్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 16న బంగ్లాదేశ్తో, 18న శ్రీలంకతో అఫ్ఘాన్ తన గ్రూప్ మ్యాచ్లను అబుదాబిలోనే ఆడనుంది.
జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అల్లా ఘజన్ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ.