నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో, ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వర్షం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం, అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.