- Advertisement -
- ప్రతీ రూపాయి వినియోగదారుడికి చేరాలి
- వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ తగ్గించిన పన్ను రేట్లను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఆదా అయిన ప్రతీ రూపాయిని వినియోగదారులకు అందించాలన్నారు. అదే విధంగా దేశీయ ఉత్పత్తులకు ఎక్కువ ప్రచారం కల్పించాలని సూచించారు. భారతీయుల కష్టార్జితంతో ఇక్కడి భూమిలో పండిన ఉత్పత్తులకు మద్దతును అందించాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులు దేశంలోని ప్రతీ మూలకు చేరినప్పుడు అవి ఆర్థిక విలువతో పాటు దేశ స్వావలంబనను సూచిస్తాయన్నారు. జీఎస్టీ శ్లాబులను 5, 18 శ్లాబులకు పరిమితం చేస్తూ బుధవారం జీఎస్టీ కౌన్సిల్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పీయూశ్ గోయల్ తగ్గిన రేట్లను వినియోగదారులకు బదిలీ చేయాలని కంపెనీలకు, విక్రేతలకు సూచించారు.
రుణాల విస్తరణకు డిమాండ్ : ఎస్బీఐ చైర్మెన్
జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను 5 శాతం, 12 శాతానికి పరిమితం చేయడం పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒక మైలురాయి అని ఎస్బీఐ చైర్మెన్ సిఎస్ శెట్టి అన్నారు. గతంలో 12 శాతం, 18 శాతం పన్ను విధించబడిన గృహోపకరణాలు ఇప్పుడు 5 శాతంలోకి వచ్చాయన్నారు. ఇది తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం అందిస్తుందన్నారు.. ఎక్కువ వినియోగ శక్తితో, డిమాండ్, రుణ విస్తరణ పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుందని సిఎస్ శెట్టి అన్నారు. బీమా రంగం తక్కువ ప్రీమియంతో మెరుగైన రక్షణ కవరేజీ సహా బీమా వినిమయం విస్తరణకు దోహదం చేయనుందన్నారు. రాబోయే త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధికి సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.
నిర్మాణ వ్యయం తగ్గనుంది : అన్రాక్
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం ద్వారా రియల్ ఎస్టేట్కు ఊతం లభించనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాణ రంగంలోని పలు వస్తువుల ధరలకు సంబంధించిన శ్లాబులను మార్చడం ద్వారా ముడి సరుకుల వ్యయం తగ్గనుందని ఆన్రాక్ గ్రూప్ చైర్మెన్ అనుజ్ పూరి పేర్కొన్నారు. సిమెంట్పై పన్నులు తగ్గడం ద్వారా నిర్మాణ వ్యయం 3-5 శాతం వరకు తగ్గనుందన్నారు.
- Advertisement -