నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తలపడుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 14న దాయాదుల మధ్య మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ క్రీడా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన తర్వాత పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సందిగ్ధత నడుమ, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం క్రీడావిధానంపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, శత్రు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడరాదని, అయితే ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి బహుళ దేశాల టోర్నమెంట్లలో మాత్రం పాల్గొనవచ్చని సూచించింది. ఆసియా కప్ మల్టీ-నేషనల్ ఈవెంట్ కావడంతో, టీమిండియా ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, “ప్రభుత్వ నిబంధనలను అనుసరించి బీసీసీఐ నడుచుకుంటుంది. ఆసియా కప్లో భాగంగా టీమిండియా పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతుంది” అని అధికారికంగా ప్రకటించారు.