– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లబ్ధిదారులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.
ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల సహకారంతో ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు ఉన్నారు.