అభ్యర్థులను ప్రకటించిన విద్యార్థి సంఘాలు
18న పోలింగ్
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్యూ) ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. విద్యార్థి సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించి హౌరాహౌరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుకోసం ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నాయి. డీయూఎస్యూ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 18న జరగనుంది. క్యాంపస్లో విద్యార్థినుల నాయకత్వాన్ని పోత్సాహించేందుకు రెండు విద్యార్థి సంఘాలు కీలకమైన అధ్యక్ష పదవికి వారిని పోటీకి నిలిపాయి. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ 17 ఏండ్ల తరువాత జోస్లిన్ నందితా చౌదరిని అధ్యక్ష పదవికి బరిలో దింపింది. 2008 నుంచి అధ్యక్ష పదవిని ఏ విద్యార్థిని కైవసం చేసుకోలేదు. అందువల్ల ఇది చారిత్రాత్మక చర్యగా ఎన్ఎస్యూఐ పేర్కొంది. ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్ష పదవికి రాహుల్ ఝాన్స్లా, ప్రధాన కార్యదర్శి పదవికి కబీర్, సహాయ కార్యదర్శి పదవికి లవ్కుష్ భదానాను బరిలోకి దింపింది.
క్యాంపస్ రాజకీయాల్లో ‘డబ్బు, కండబలానికి’ వ్యతిరేకంగా తమ ప్యానెల్ ‘ప్రత్యామ్నాయ స్వరం’ సూచిస్తుందని వామపక్ష విద్యార్థి సంఘాల ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ కూటమి పేర్కొంది. అధ్యక్ష పదవికి అంజలి, ఉపాధ్యక్షుడిగా సోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి పదవికి అభినందన ప్రత్యాషి, సహాయ కార్యదర్శి పదవికి అభిషేక్ కుమార్ను ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ కూటమి బరిలోకి దింపింది.
ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ అధ్యక్షుడిగా ఆర్యన్ మాన్, ఉపాధ్యక్షుడిగా గోవింద్ తన్వర్, ప్రధాన కార్యదర్శిగా కునాల్ చౌదరి, సహాయ కార్యదర్శిగా దీపికా ఝాలను పోటీలో దింపింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు తమ తమ రాష్ట్రాల విద్యార్థులకు జరిగే డిన్నర్ పార్టీల్లో పాల్గొని ఏబీవీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. డబ్బులను వెదజల్లి డిన్నర్ పార్టీలను నిర్వహిస్తోంది.