ప్రతి చిన్నారికి భద్రతతో కూడిన బాల్యం అందించడమే లక్ష్యం
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం : సీఐఐ కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో చిన్నారుల భద్రతను తమ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తోందనీ, త్వరలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం నూతన పాలసీ తీసుకురాబోతున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ప్రకటించారు. శనివారం హైదరాబాద్లోని హౌటల్ పార్క్లో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో మాసూమ్ సమ్మిట్ పదో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు డీజీ. శికా గోయల్, సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మెన్ శివప్రసాద్ రెడ్డి, మాసూమ్ యంగ్ ఇండియన్స్ చైర్పర్సన్ జోష్నాసింగ్ అగర్వాల్, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మెన్ తరంగ్ ఖురానా, మాసూమ్ కోచ్ భవిన్ పాండ్యా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ”పిల్లలు అంటే మన భవిష్యత్తు. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ. పసి హదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి. చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత” అని చెప్పారు.
ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహిస్తామనీ, అందులో వచ్చే సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త పాలసీ రూపొందిస్తామని చెప్పారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ”పిల్లల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు పరిశోధనలు జరిపి అంగన్వాడీ మెనూలో మార్పులు చేశామని గుర్తుచేశారు. లైంగిక నేరాల నియంత్రణలో కేవలం శిక్షలకే పరిమితం కాకుండా శిక్షణా కార్యక్రమాలు కూడా ఉండాలని సీతక్క స్పష్టం చేశారు. పాఠశాలల్లో అమ్మాయిలకు స్వీయ రక్షణ శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. మహిళలను గౌరవించాలనే విషయాన్ని తరగతి గదిలోనే పిల్లలకు నేర్పాలనీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ఇండ్లల్లో, పాఠశాలల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తప్పు జరిగితే పిల్లలు ధైర్యంగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. చిన్నారుల అక్రమరవాణ, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, నిఘాను పెంచామని తెలిపారు.