– హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కామారెడ్డిలో సోమవారం బీఆర్ఎస్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. కేసీఆర్కే ఓటేసి గెలిపిస్తామంటూ 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు సంబంధిత తీర్మాన పత్రాలను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. ఎమ్మెల్యే గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆ నిర్ణయం వల్ల ఆ రెండు నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ , కార్పొరేషన్ల చైర్మెన్లు అయాచితం శ్రీధర్, మఠం బిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచరెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావ్ , గాంధారి మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యం రావ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ చంద్రం , కామారెడ్డి సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి పాల్గొన్నారు.