నవతెలంగాణ-హైదరాబాద్ : og సినిమాను ఇంత ప్రేమిస్తానని తనకు తెలియదని అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 25న థియేటర్లలోకి రానుంది. ఆదివారం హైదరాబాద్లో ‘ఓజీ కన్సర్ట్’ నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సుజీత్ చెప్పేది తక్కువ. కానీ, సినిమా తీసేటప్పుడు మామూలుగా ఉండదు. ఈ సినిమాకు ఎక్కువ క్రెడిట్ అతడికే దక్కుతుంది. సుజీత్ విజన్ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ ఇద్దరూ ఒక ట్రిప్లో మూవీ చేశారు. అందులోకి నన్నూ లాగారు. ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? ‘ఖుషీ’లో ఈ ఖటానాను ప్రాక్టీస్ చేశా. దీని చుట్టూ కథ అల్లి సినిమాను రంజింపజేసేలా తీశారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్తో మంచి లవ్స్టోరీ తీశారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ‘ఖుషీ’ అప్పుడు ఈ జోష్ చూశా’’
‘‘పాలిటిక్స్ వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నాననంటే అందుకు కారణం మీరే. సినిమా చేసేటప్పుడు అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. ఇలాంటి దర్శకత్వ టీమ్ నేను ‘జానీ’ చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లో వచ్చే వాడిని కాదు. తెలుగు వాడంటే ఆకాశం ఉరుముతోంది. అన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించారు. భవిష్యత్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే, శ్రియారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా’’ అని పవన్కల్యాణ్ అన్నారు. ఈవెంట్ మొదలైన దగ్గరి నుంచి ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయినా లెక్క చేయకుండా అభిమానులను అలరించేందుకు పవన్కల్యాణ్, సహా చిత్ర బృందం మొత్తం వర్షంలోనే తడుస్తూ ప్రసంగించారు. ‘‘వర్షం మనల్ని ఆపుద్దా.. ఏది మనల్ని ఆపింది ఇప్పటి వరకు. ఓటమి మనల్ని ఆపలేదు.. వర్షం కూడా ఆపలేదు’’ అంటూ భారీగా తరలివచ్చిన అభిమానుల్లో పవన్ ఉత్సాహం నింపారు.