నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రులు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాల్లో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో, మరికొన్నిచోట్ల యువజన సంఘాల ఆధ్వర్యంలో దేవి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. అమ్మవారి మండపాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండల కేంద్రంలో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని బస్టాండ్ నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం వరకు భాజా భజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించారు.
మండలంలో అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో శరన్నవరాత్రులతో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండపాల వద్ద చిన్నారుల, యువకుల కేరింతలతో పండగ వాతావరణం నెలకొంది. దేవి నవరాత్రులను పురస్కరించుకొని పలువురు అమ్మవారి మాలధారణ స్వీకరించారు. మండల కేంద్రంలో దేవీ నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి తెలిపారు.