Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లో పకడ్బందీగా శానిటేషన్‌

ప్రభుత్వాస్పత్రుల్లో పకడ్బందీగా శానిటేషన్‌

- Advertisement -

సెక్యూరిటీ సిబ్బంది వేతనాల్లో అక్రమాలకు తావు లేకుండా కొత్త పాలసీ : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రులను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలను బలోపేతం చేయడానికి కొత్త పాలసీల రూపకల్పనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, డైట్‌ పాలసీల్లో ఉన్న లోపాల వల్ల ఎదురవుతున్న సమస్యలను డీఎంఈ నరేంద్ర కుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ అజయ్ కుమార్‌ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. హాస్పిటల్‌ లోపల, బయట పరిశుభ్రంగా ఉంచే బాధ్యత శానిటేషన్‌ కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో శాస్త్రీయమైన పారామీటర్లు ఉండాలనీ, ఆయా నిబంధనల ప్రకారం హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచకపోతే కాంట్రాక్ట్‌ రద్దు చేసే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. పెస్ట్‌ కంట్రోల్‌ను కూడా శానిటేషన్‌లో భాగం చేయాలనీ, సర్టిఫైడ్‌ పెస్ట్‌ కంట్రోలర్లను నియమించుకునేలా టెండర్‌ నిబంధనలు ఉండాలన్నారు. పేషెంట్లకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు.

డైట్‌ మెనూ తప్పనిసరిగా అమలు అయ్యేలా పర్యవేక్షణ ఉండాలనీ, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేషెంట్‌ కేర్‌ వర్కర్లుగా క్వాలిఫైడ్‌ వారిని మాత్రమే నియమించాలని సూచించారు. టెండర్‌ నిబంధనల్లో సరియైన నియమాలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులుగా వృద్ధులను, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ లేని వారిని కాంట్రాక్టర్లు నియమిస్తున్నారనీ, ఈ అంశంలో మార్పు తీసుకురావాలని అధికారులు మంత్రిని కోరారు. మొత్తం సెక్యూరిటీ సిబ్బందిలో కొంత శాతం మేర ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని నియమించాలనీ, ఇందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలన్నారు. ఈ సందర్భంగా కొత్త పాలసీల రూప కల్పనపై మంత్రి పలు సూచనలు చేశారు. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ పోస్ట్‌ ఉండాలనీ, ఈ పోస్టులో తప్పనిసరిగా రిటైర్డ్‌ ఆర్మీ పర్సన్‌ నియమించాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ టీవీ మానిటరింగ్‌ రూమ్‌ ఉండాలని సూచించారు. పేషెంట్‌ కేర్‌ వర్కర్లలో కనీసం 60 శాతానికి తగ్గకుండా మహిళలు ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్కర్ల వేతనాల చెల్లింపుల్లో అక్రమాలకు అవకాశం ఉండొద్దనీ, క్యాష్‌ పేమెంట్‌ సిస్ట్‌మ్‌ పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలోనే వేతనాలు జమ చేసేలా టెండర్‌ కండీషన్‌ ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఐపీఎం (ఫుడ్‌ సేఫ్టీ) డైరెక్టర్‌, డాక్టర్‌ శివలీల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -