Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపారామెడికల్‌ పోస్టులు భర్తీ చేయాలి

పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేయాలి

- Advertisement -

తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌
కోఠి డీఎంహెచ్‌ఎస్‌ వద్ద ధర్నా


నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
పారామెడికల్‌ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ ఆవరణలో బుధవారం పారామెడికల్‌ సిబ్బందితో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించినా, 2023- 24లో వేసిన నాలుగు నోటిఫికేషన్లు నేటికీ పూర్తి కాలేదని, రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిరంతరం అదే పనిలో ఉన్నా పూర్తికాకపోవడంతో అభ్యర్థులు నిరాశలో ఉన్నారని చెప్పారు. ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల వరకు వెరిఫికేషన్‌ పూర్తి చేశారన్నారు. అలాగే, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల ప్రక్రియకు సంబంధించిన ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు మాత్రమే ఇచ్చారని, ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసి నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

నర్సింగ్‌ ఆఫీసర్లకు సంబంధించిన అభ్యంతరాలు కూడా చాలా తక్కువగా వచ్చాయని తెలిసిందని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. 2023లో నోటిఫికేషన్‌ ఇచ్చి ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ (ఏఎన్‌ఎం) పోస్టుల భర్తీ కూడా పెండింగ్‌లో ఉందని, వెంటనే మెరిట్‌ లిస్ట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నోటిఫికేషన్లలో ఫార్మాసిస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌.. కోర్టు ఇతర వివాదాల వల్ల పెండింగ్‌లో ఉందని, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారని, త్వరగా వారి రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలని కోరారు. అనంతరం రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దిన్‌, వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -