నవతెలంగాణ-హైదరాబాద్: చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి, తమ ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దు కానీ.. వాళ్లు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. అలాంటి వాళ్లను తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరించింది.
తన కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023లో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణ ఖర్చులు అందేలా చూడాలని.. అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. నెలకు రూ.3000తో పాటు ఆ వృద్ధ జంట ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడికి తీర్పునిచ్చింది.
కుమారుడు ముంబై హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కింది కోర్టు.. ఆ కుమారుడికి సపోర్టు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ కొడుకు కూడా ఒక సీనియర్ సిటిజన్. అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఆ వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈకేసును విచారించిన కోర్టు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసింది. ట్రైబ్యూనల్ కోర్టు తీర్పును సమర్థించింది.