Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ

- Advertisement -

నేటి నుంచి అక్టోబరు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
అదేనెల 23న లాటరీ పద్ధతిలో ఎంపిక


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించ నున్నారు. రెండేండ్ల కాలానికి (2025 డిసెంబర్‌1 నుంచి 2027 నవంబర్‌30 వరకు) అనుమతులతో ఎక్సైజ్‌ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్దారించారు. ఎక్సైజ్‌ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. దుకాణాల కేటాయింపులో గౌడ్‌ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. రిజర్వేషన్‌ కల్పించిన దుకాణాల్లో దరఖాస్తు చేసుకునేవారు కుల ధృవీకరణ పత్రంతో పాటు రూ. 3 లక్షల డీడీ, లేదా చలాన్‌ జతపరచాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం సకాలంలో అందని వారు, నవంబరు 15 వరకు అందజేయాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుతో పాటు అండర్‌ టేకింగ్‌ పత్రాన్ని జతపర్చాలి. డీడీలు, లేదా చలాన్లను డీపీఓ (జిల్లా ప్రొహిబిషనర్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి) పేరున తీయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను డీపీఓ, డిప్యూటీ కమిషనర్‌ లేదా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అందజేయడానికి అవకాశం కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -