Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుBlood: దేశంలో ప్రతిరోజు 40 వేల యూనిట్ల రక్తం అవసరం

Blood: దేశంలో ప్రతిరోజు 40 వేల యూనిట్ల రక్తం అవసరం

- Advertisement -

– స్వచ్ఛంద రక్తదాతలకు సన్మానం

– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు.

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా అత్యవసర సమయంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు ప్లేట్ లెట్స్ ను అందజేస్తున్న భిక్కనూర్ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి, దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్ లను సన్మానించి అభినందించడం జరిగిందనీ బాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 40 వేలయూనిట్ల రక్తం అవసరం ఉంటుందని, ప్రతి సంవత్సరం 14 మిలియన్ యూనిట్ల రక్తము వివిధ చికిత్సల నిమిత్తమై అవసరమని, ఈ రక్తాన్ని సకాలంలో అందుబాటులో ఉంచాలంటే యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. బద్దం నిశాంత్ రెడ్డి, లక్క బత్తిని రవికుమార్ లు నేటి సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారని ఆపదలో ఉన్న వారి కోసం సంవత్సరంలో నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి సకాలంలో ప్లేట్ లెట్స్ ను అందజేస్తూ ప్రాణాలను కాపాడుతున్నారని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.

రక్తదానం చేసే వారికి గుండె జబ్బు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలో తెలియడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,గంప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -