విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

– ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించి మతి చెందిన విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ సోషల్‌ మీడియా, టీవీ, సెల్‌ ఫోన్‌ ప్రభావము వలన యువతీ, యువకులు పక్కదారి పడుతున్నారని అదుపులేని ఇంస్టాగ్రాములు వాట్సాప్‌ లో మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. విద్యార్థినిల వాయిస్‌ రికార్డు బయటకు వచ్చిందని దాని ప్రకారంగా ఇన్స్‌ ట్రా గ్రామ్‌ లో వారి డీపీలను మార్చి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని వారు గడ్డి మందు తాగిన తదుపరి మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని కోరారు. జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరపాలని వారి కాల్‌ డేటా ఆధారంగా దోషులు ఎవరైనా ఉంటే దొరకబట్టి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులను పరమార్శించిన వారిలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమా రాణి, బొల్లేపల్లి మంజుల, తదితరులు పాల్గొన్నారు.

Spread the love