నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో వివాదాలు పెరిగాయని, సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యేలా ఒకరకమైన వాతావరణం సృష్టించారని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన తివారీ, గంభీర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. “జట్టులో అశ్విన్, రోహిత్, విరాట్ వంటి సీనియర్లు ఉంటే, వాళ్లకు హెడ్ కోచ్ కన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఏదైనా నిర్ణయం వారికి నచ్చకపోతే, వాళ్లు తప్పకుండా ప్రశ్నలు సంధిస్తారు. ఈ కారణంతోనే వాళ్లు జట్టులో లేకుండా గంభీర్ చూసుకున్నారు” అని తివారీ ఆరోపించాడు. గంభీర్ తన నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే సీనియర్లపై ఒత్తిడి పెంచి, వారు రిటైర్ అయ్యేలా చేశారని ఆయన అభిప్రాయపడ్డాడు.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా, ఈ ఏడాది మే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు కొన్ని వారాల ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయాన్ని తివారీ గుర్తు చేశాడు. “గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి జట్టులో అనవసర వివాదాలు ఎక్కువయ్యాయి. హఠాత్తుగా కొందరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం, నేరుగా తుది జట్టులో ఆడించడం వంటివి చూస్తున్నాం. ఆయన నిర్ణయాల్లో స్థిరత్వం లేదు” అని విమర్శించాడు. రాబోయే 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీలను చేర్చుకోకపోతే అది గంభీర్ తీసుకునే అత్యంత చెత్త నిర్ణయం అవుతుందని ఆయన హెచ్చరించాడు.