నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వాక్యాలను ప్రతి ఒక్కరు ఖండించాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుక్కాపురం మహేష్ అన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. ఒకరిని హేళన గా మాట్లాడేముందు నువు ఎలా ఉన్నవో చూసుకొని మాట్లాడాలని అన్నారు. ప్రజాసేవలో నిష్టతో ఉన్న దళిత మంత్రి పై ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి తగనిది అన్నారు. ఆయన దళిత మంత్రిగా ఉన్నందునే ఉద్దేశపూర్వకంగా అవమానించారని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత దూషణ కాదు, దళిత వర్గాల, మాదిగ సమాజం ఆత్మగౌరవంపై నేరుగా దాడి అని తీవ్రంగా విమర్శించారు.
పొన్నం ప్రభాకర్ వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా మంత్రి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రజాస్వామ్య ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య మర్యాదలు పాటించాలి. దళిత మంత్రులను, మాదిగ వర్గ నాయకులను అవమానించే విదంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యల భారత్,రమేష్ ,రాజు,సంపత్,మాదిగ విద్యార్థినిలు ఐశ్వర్య, నందిని శృతి, తదితరులు ఉన్నారు.