నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి క్యాంపు కార్యాలయం, అమరవీరుల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పావుశెట్టి సునిల్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాత ఏటీఎం సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం బీజేపీ కార్యాలయంలోనూ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.పాత ఏటీఎం సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చల్లా ధర్మారెడ్డి జెండాకు గౌరవ వందనం సమర్పించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.పరకాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సివిల్ జడ్జి కోర్టు, సబ్జైలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలోనూ అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సతీష్బాబు, పోలీస్స్టేషన్లో సీఐ క్రాంతికుమార్, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో, వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఏరియా ఆసుపత్రి తదితర కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తాతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని కామారెడ్డిపల్లి, వెల్లంపల్లి, పోచారం, నాగారం, మల్లక్కపేట, వెంకటాపురం, హైబోత్పల్లి, లక్ష్మీపురం, అలియాబాద్, పైడిపెల్లి గ్రామపంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.



