Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చివరిగింజ వరకు ధాన్యం సేకరించాలి: కలెక్టర్

చివరిగింజ వరకు ధాన్యం సేకరించాలి: కలెక్టర్

- Advertisement -

ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో మౌళిక వసతులు కల్పించాలి..
అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ కొనుగోలు విజయవంతం చేయాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలను ఆదేశించారు. ఖరీఫ్ ( వానాకాలం) 2025-26 సీజన్ కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశం మందిరంలో ఐకెపి, పిఎసిఎస్, ఎఫ్ పి ఓ, మెప్మా శాఖలకు చెందిన కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో ఐకేపీ ద్వారా 158,పి ఏ సి ఎస్ ద్వారా 122,ఎఫ్ పి ఓ ద్వారా 15,మెప్మా ద్వారా 13 మొత్తం 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ప్రారంభించాలని ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతంలో ఉండకుండా ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కేంద్రంలో వేయింగ్ మిషన్,విద్యుత్,త్రాగునీరు, ప్లెక్సీపై నిర్వాహకుల పేరు ఫోన్ నెంబర్, టార్పాలిన్ పట్టాలు, పాడి క్లీనర్లు, డ్రైయర్లు, ట్యాబ్ లాంటి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

దాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరినప్పటి నుండి మిల్లులో దిగుమతి అయ్యేవరకు నిర్వాహకులదే బాధ్యత కాబట్టి నిర్వాహకులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఎక్కడైనా ఎక్కువ టార్పాలిన్ పట్టాలు అవసరం ఉంటే ముందస్తుగా సర్దుబాటు చేసుకోవాలని అన్నారు.జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను తనిఖీలు చేసినప్పుడు ఏమైనా సమస్యలు గుర్తిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గతంలో జరిగిన తప్పులు దొర్లకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.రైతులు కొనుగోలు కేంద్రాలకు గడ్డి,తాలు, దుమ్ము లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు.కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు మండలాల వారీగా షెడ్యూల్ తయారుచేసి ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి పంపిణీ చేయాలని సివిల్ సప్లై డిఎం ను ఆదేశించారు.

ధాన్యం కాంటా వేసిన తర్వాత వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించే విధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.ఐ కే పి, పి ఏ సి ఎస్ , మార్కెటింగ్, మెప్మా శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేసి విజయవంతం చేయాలని,కలెక్టరేట్ లో కంట్రోల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసి రైతుల నుండి ఫిర్యాదు అందగానే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

అదనపు కలెక్టర్  కే సీతారామరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు మిల్లర్ల ధర కంటే ఎక్కువ మద్దత్తు ధర కల్పిస్తుందని గ్రేడ్ ఎ ధాన్యం రకానికి రూపాయలు 2389, కామన్ రకానికి చెందిన ధాన్యానికి రూపాయలు 2369 మద్దతు ధర ఇస్తుందని అలాగే సన్న రకం వడ్లకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ కల్పిస్తుంది కాబట్టి రైతులు నష్టపోకుండా అన్ని ఏర్పాట్లను కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాలని ఆకస్మిక వర్షాలు కురుస్తున్నందున ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.ఏపీఎంలు,పి ఎస్ సి ఎస్ సి ఓ లు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు ఎన్ని అవసరం ఉంటే అన్ని సరఫరా చేసేలా చూసుకోవాలని, వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభించేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి వివి అప్పారావు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం రాము, డి సి ఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి, ఐకెపి,పి ఎ సి ఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -