ఏపీలో ఆరుగురి సజీవ దహనం
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు బాణాసంచా పరిశ్రమ యజమాని సత్తిబాబు కూడా ఉన్నట్టు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 40మంది కార్మికులు పనిచేస్తున్నారు. భారీ పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణాసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్టు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బాణాసంచా పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, వైద్యసాయంపై వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై హౌంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు.