– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
– యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు సాగించేవారు హెల్మెట్ బరువు కాదు…బాధ్యత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలను కళాబృందం సభ్యులు అందించారు. అనంతరం ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించారు.కల్తీ కల్లు వద్దు, జీవితం ముద్దు అన్నారు. కల్తీ కల్లు తాగి ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబాలను రోడ్డున పడయోద్దని సూచించారు.
ద్విచక్ర వాహనాలపై పయనాలు సాగించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత అన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్లొద్దన్నారు.మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు మహిళల రక్షణ కోసం షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, చోరీకి గురైన సందర్భంలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో,
ఎమర్జెన్సీ సేవల కోసం డయల్ 100 ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండడమే మార్గమన్నారు. ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయాలన్నారు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సూచించిన ఆయన మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయని తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం నేరమని, చట్టపరమైన శిక్షకు లోనవుతారన్నారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని కోరారు. గ్రామస్తులంతా అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.