నవతెలంగాణ-హైదరాబాద్ : కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిట్ దర్యాప్తును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. తమ పార్టీ పట్ల సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. 41 మంది మృతి చెందిన తొక్కిసలాట ఘటన దేశాన్ని కదిలించిందని పేర్కొంది. ఈ మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. నిస్సందేహంగా.. న్యాయసమ్మతమైన, పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.