నేటితో ముగియనున్న ఆధార్, పాన్‌ లింక్ గడువు

నవతెలంగాణ – హైదరాబాద్: మీ ఆధార్, పాన్‌లను లింక్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే ఆ పని చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఇచ్చిన గడువు ఈరోజు (మే 31వ తేదీ)తో ముగుస్తుంది గడువు లోపు జత చేయకపోతే, తర్వాత అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పాన్‌ను బయోమెట్రిక్‌ ఆధార్‌తో అనుసంధానించాలి. లేకపోతే 2024 మార్చి 31 వరకూ నిర్వహించిన లావాదేవీలపై మూలం వద్ద పన్ను కోత రెట్టింపు అవుతుంది. మే 31 నాటికి ఈ రెండింటినీ జత చేసిన వారికి అధిక మొత్తంలో టీడీఎస్‌ విధించబోమని గత నెలలో ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఆధార్‌తో పాన్‌ అనుసంధానం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేసి, వివరాలు నమోదు చేయడం ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. అనుసంధానమైతే లింక్‌ అయినట్లు మెసేజ్ వస్తుంది. లేకపోతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి లింక్ పూర్తి చేసుకోవచ్చు. రుసుము చెల్లించిన తర్వాత 4-5 రోజుల తర్వాతే ఆధార్‌-పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలవుతుంది.

Spread the love