నవతెలంగాణ – న్యూజిలాండ్: న్యూజిలాండ్లో పక్షి ఢీకొట్టడంతో విమానం ఇంజిన్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ ఏమాత్రం ఆందోళన చెందని పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. వర్జిన్ ఆస్ట్రేలియా విమానం బోయింగ్ 737-800 మెల్బోర్న్ వెళ్లేందుకు న్యూజిలాండ్లోని క్వీన్స్టౌన్లో సోమవారం సాయంత్రం టేకాఫ్ అయింది. విమానంలో 67 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. పక్షి ఢీకొట్టడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విమానాన్ని ఇన్వెర్కాగిల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.