నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కోల్కతాలోని ఆమె నివాసంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన, “దీదీ, మీరు ఓడిపోలేదు” అని వ్యాఖ్యానించినట్లు టీఎంసీ అధికార వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ అధినేత్రి నివాసంలో మమతతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కూడా అఖిలేష్ యాదవ్ కలిశారు. రాష్ట్రంలో బీజేపీపై మీరు చేసిన పోరాటం ఎంతో ప్రశంసనీయమని వారిద్దరితో అఖిలేష్ అన్నట్లు తెలుస్తోంది.
అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణ ప్రజల ఓటు హక్కును బీజేపీ లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా, దళిత, అల్పసంఖ్యాక వర్గాల వారి ఓటు హక్కును లాక్కుంటోందని మండిపడ్డారు. ఈ సమస్య ఇక్కడికే పరిమితం కాలేదని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు.



