– గజ్వేల్లో మర్కుక్ మండల రైతుల నిరసన
నవతెలంగాణ-గజ్వేల్
త్రిబుల్ ఆర్ రోడుకు భూములిచ్చేది లేదంటూ, నిర్మాణం నిలిపి వేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కాలువలకు భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని.. ఇప్పుడు రింగ్ రోడ్డు కోసమంటూ మళ్లీ తమ భూములను ఇవ్వాలనడం సరికాదని మర్కుక్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన చేపడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం మూలంగా భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యామని.. ప్రస్తుతం ఈ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు పేరిట భూములను తీసుకునేందుకు ప్రయత్నాలు చేయడం విరమించుకో వాలన్నారు. ఎకరం భూమి రెండు మూడు కోట్లు ధర పలుకుతుండగా ప్రభుత్వం లక్షల్లో పరిహారం చెల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు వేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.