నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి అకాల మరణం వృత్తిదారుల ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సంతాప సభలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, లెల్లెల బాలకృష్ణ, ఫైల్ ఆశయ్య, ఉడుత రవీందర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కిల్లి గోపాల్ తదితర నాయకులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. మల్లారెడ్డి తన జీవితాన్ని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, చేతివృత్తిదారులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అంకితం చేశారని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని తెలిపారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. సాధారణ జీవనం, నిరాడంబరత, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం మల్లారెడ్డి జీవితంలో ప్రత్యేక లక్షణాలని పేర్కొన్నారు. ఆయన ఆచరించిన విలువలు, ప్రజా ఉద్యమాల పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం నేటి ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సమస్యలపై మరింత ఐక్యంగా పోరాడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళులని తెలిపారు.
జూలూరు గౌరీశంకర్ సంతాపం
వ్యవసాయ రంగంపై గట్టిపట్టున్న రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మరణం తెలంగాణకు తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ పోరాటాలపై సారంపల్లికి గట్టిపట్టు ఉందని చెప్పారు. తెలంగాణలో భూమి పంపకాలు, భూసంస్కరణలకు సంబంధించిన సమాచార దర్శినిగా మల్లారెడ్డిని నిలిచారని కొనియాడారు.
జయప్రదంగా ముగిసిన జీఎమ్పీఎస్ మహాసభ :
సారంపల్లికి ఘన నివాళి
మేడ్చెల్ -మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో మూడు రోజులపాటు కొనసాగిన గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎమ్పీఎస్) నాలుగో మహాసభ సోమవారం జయప్రదంగా ముగిసింది. ఈ మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. రైతు ఉద్యమ నేత, జీఎమ్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడైన సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల మహాసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
మల్లారెడ్డికి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



