హెచ్‌సీఏ క్రికెట్‌ హెడ్‌గా

హెచ్‌సీఏ క్రికెట్‌ హెడ్‌గా– వెంకటేశ్‌ ప్రసాద్‌?!
– అపెక్స్‌ కౌన్సిల్‌లో అధ్యక్షుడు జగన్‌ ప్రతిపాదన
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) క్రికెట్‌ వ్యవహారాల హెడ్‌గా భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు ప్రతిపాదించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి సదుపాయాలతో కూడిన ఆధునాతన స్టేడియం నిర్మాణంపై హెచ్‌సీఏ సిద్ధంగా ఉందని, స్థలం కేటాయింపు కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. జిల్లా కేంద్రాల్లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ స్థాయి మూడు స్టేడియాలను నిర్మించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ నివేదికలను ఆమోదించటంతో బీసీసీఐ నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. హెచ్‌సీఏ క్రికెట్‌ ఈ నెల 8 నుంచి ఆరంభం కానుండగా.. మహిళల లీగ్‌ క్రికెట్‌ రోడ్‌మ్యాప్‌పై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించారు. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లు ఆర్‌. దేవరాజ్‌, సికె శ్రీనివాసరావు, సునీల్‌ అగర్వాల్‌లు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love