– కర్నాటక బీజేపీ నేత ఈశ్వరప్ప తిరుగుబాటు
న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో బీజేపీ సీనియర్ నాయకులు ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. కర్నాటకకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత కెఎస్ ఈశ్వరప్ప తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో శివమొగ్గ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు.
తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. తన కుమారుడికి హవేరీ నియోజకవర్గం టికెట్ నిరాకరించడానికి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కారణమని అన్నారు.
మధ్యప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా
మధ్యప్రదేశ్లో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విడి శర్మకు తన రాజీనామా లేఖలు పంపించారు. 2018 మార్చిలో బీజేపీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది.